పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోని (ముచ్చింతల్ రోడ్) గొల్లూరు ఫారెస్ట్ పార్క్ లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0 ప్రారంభం కానుంది.
‘పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం’ అంటూ సేవ్ సాయిల్ (Save Soil) ఉద్యమంతో సద్గురు ప్రపంచయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈ నెల 15 న హైదరాబాద్కు చేరుకుని, 16న కర్నూలు మీదుగా బెంగుళూరు వెళ్తుంది. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఐదేళ్ల కింద చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న సద్దురు ఈ మహత్ కార్యక్రమంలొ తాను కూడా పాల్గొనేందుకు సుముఖత తెలిపారు. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సద్దురు గొల్లూరు చేరుకుని సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి, ఐదో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొని, మొక్కలు నాటుతారు. కార్యక్రమం కోసం తరలివచ్చే ప్రముఖులు, గ్రీన్ ఇండియా ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అనుసరిస్తున్న అభిమానులు ఇదే అటవీ ప్రాంతం వేదికగా ఒకే సారి పదివేల మొక్కలను నాటనున్నారు. క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవనం చేయడంలో భాగంగా తెలంగాణ అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి నిర్వహిస్తోంది.
2018లో పురుడుపోసుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా చాలెంజ్ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరడమే గ్రీన్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తి. ప్రారంభించిన అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఒక్క తాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నింపింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా నలుదిక్కులా మొక్కలు నాటడం, పచ్చదనం పెంచడం ఉద్యమస్ఫూర్తితో కొనసాగుతోంది. గత నాలుగేళ్లలో గిన్నిస్ రికార్డులతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టు లాంటి వినూత్న కార్యక్రమాలతో కోట్లాది మొక్కలను నాటడం, సంరక్షించడం, అటవీ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ది చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసింది గ్రీన్ ఇండియా చాలెంజ్. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ ఐడో విడతలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ను మరింతగా విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా విభిన్న వర్గాల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తామని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు.