నావంతు సహాయ, సహకారాలు అందిస్తా
ఫిల్మ్సిటీలో మొక్కనాటిన అమితాబ్బచ్చన్
వృక్షవేదం పుస్తకం అందజేసిన ఎంపీ సంతోష్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా హరితస్ఫూర్తిని నింపేలా ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమమని బాలీవుడ్ నటుడు అమితాబ్బచ్చన్ కొనియాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో ఆయన మొక్క నాటారు. ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావితరాలకు అవసరమైన గొప్ప కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్కుమార్ చేపట్టారని అమితాబ్ ప్రశంసించారు. ఇందులో ఆయనతోపాటు పాల్గొని మొక్కనాటడం సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమం మరింత విజయవంతంగా కొనసాగి పచ్చదనం మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గ్రీన్చాలెంజ్కి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ప్రత్యేకంగా ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని అమితాబ్కు ఎంపీ సంతోష్కుమార్ బహూకరించారు. సినీనటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్చాలెంజ్ చాలా ఫెంటాస్టిక్ కార్యక్రమమని, ఇది ఒక రాష్ర్టానికే కాదు.. దేశం మొత్తానికి అవసరమైనదని చెప్పారు. ప్రతిఒక్కరూ చాలెంజ్గా తీసుకుని పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటికే ఎంపీ సంతోష్ 16 కోట్ల మొక్కలు నాటించారని, అది 1600 కోట్లకు పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్మాత అశ్వినీదత్, ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.