TS Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్కు గ్రీన్ బిల్డింగ్ ఇండియా కౌన్సిల్ గోల్డ్ సర్టిఫికెట్ దక్కింది. పర్యావరణహితంగా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు పాటించినందుకు సర్టిఫికెట్ను ప్రదానం చేసింది. భారత్లో గోల్డ్ రేటెడ్ సర్టిఫికెట్ పొందిన తొలి సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్గా ఘనత సాధించింది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అవార్డును అందించారు. సచివాలయానికి సర్టిఫికెట్ రావడంపై మంత్రి వేముల హర్షం వ్యక్తం చేశారు. అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో సెక్రటేరియట్ను పర్యావరణహితంగా నిర్మించామన్నారు.
ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ చొరవ వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితాహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ఇప్పటికే గ్రీనరీ 7.7శాతం పెరిగిందన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసి, ప్లాటినం అవార్డును సైతం గెలుచుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్గా తెలంగాణ సెక్రటేరియట్ గుర్తింపు పొందడం ఎంతో సంతోషం కలిగిందన్న ఆయన.. ఈ సందర్భంగా ఈఎన్సీ గణపతిరెడ్డి బృందానికి అభినందనలు తెలిపారు.