హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకోగా.. జిల్లాల వారీగా చూసినప్పుడు రంగారెడ్డి జిల్లా ముంబైని మించిపోయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను సైతం ఇతర నగరాలకు దీటుగా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ క్ర మంలో పలు అంతర్జాతీయ సంస్థలు కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్కు తరలి వస్తుండటంతో మహానగరం ఉపాధికి కేంద్రంగా మారుతున్నది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజల తలసరి ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైనే మించిపోయింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకన్నా హైదరాబాద్ ‘గ్రేటర్’ అని రుజువు చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్డీపీఎస్) విడుదల చేసిన జిల్లాలవారీ తలసారి ఆదాయం 2020-21 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
దేశ సగటు కన్నా అధికం
రాష్ట్ర ప్రభుత్వ ప్రజానుకూల విధానాల ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం 8 ఏండ్లలోనే రెట్టింపైంది. 2020-21లో తెలంగాణలో తలసరి ఆదాయం 2.79 లక్షలుగా నమోదైంది. కాగా జాతీయ సగటు 1.27 లక్షలు మాత్రమే. టీఎస్డీపీఎస్ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.6.59 లక్షలు ఉంటే.. కనిష్ఠంగా వికారాబాద్ జిల్లాలో రూ.1.32 లక్షలుగా ఉన్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, పరిసర జిల్లాల పరిధిలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. రంగారెడ్డి తరువాత హైదరాబాద్ జిల్లా రూ.3.51 లక్షలతో రెండో స్థానంలో ఉన్నది. తర్వాతిస్థానాల్లో నిలిచిన జిల్లాల్లో హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలోనివే ఎక్కువ.
అన్ని రంగాల్లోనూ జోరు
ఇప్పటివరకూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేది. ముంబైలో తలసరి ఆదాయం రూ.6.43 లక్షలు కాగా.. రంగారెడ్డి జిల్లా (6.59 లక్షలు) దానిని అధిగమించింది. గుజరాత్లోని అహ్మదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలను దాటి రంగారెడ్డి జిల్లా దూసుకుపోయింది. గత ఆరేడు సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఐటీ రంగంలో ఎగుమతులు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. పారిశ్రామికంగా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్కు తరలివచ్చాయి.
దీంతో ఆఫీస్ స్పేస్లో సైతం హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలను మించిపోయింది. అత్యంత జీవనయోగ్యమైన నగరాలలో హైదరాబాద్కు వరుసగా ఐదుసార్లు అవార్డులు వచ్చాయి. కరోనా అనంతరం రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకోవడంతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, రోడ్లు, మెట్రో రైలు వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఫలితంగా నగరానికి రాకపోకలు, ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరితోపాటు ఆనుకొని ఉన్న మహబూబ్నగర్, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి జిల్లాలు కూడా తలసారి ఆదాయంలో వృద్ధి సాధించాయి.
జిల్లాలవారీగా తలసరి ఆదాయం (రూ.లక్షల్లో…
జిల్లా : తలసరి ఆదాయం
రంగారెడ్డి : 6.59
హైద్రాబాద్ : 3.51
మేడ్చల్-మల్కాజ్గిరి : 2.40
మెదక్ : 2.30
మహబూబ్నగర్ : 2.23
యాదాద్రి భువనగిరి : 2.22
సిద్దిపేట : 2.19
జయశంకర్ భూపాలపల్లి : 2.14
సంగారెడ్డి : 2.05
నల్లగొండ : 2.01
కరీంనగర్ : 1.91
సూర్యాపేట : 1.84
భద్రాది కొత్తగూడెం : 1.83
ఖమ్మం : 1.83
నిర్మల్ : 1.79
అదిలాబాద్ : 1.75
వరంగల్ రూరల్ : 1.76
జనగామ : 1.75
పెద్దపల్లి : 1.74
ములుగు : 1.68
నాగర్కర్నూల్ : 1.63
నిజామాబాద్ : 1.67
రాజన్న సిరిసిల్ల : 1.56
కామారెడ్డి : 1.55
మంచిర్యాల : 1.55
మహబూబాబాద్ : 1.53
వనపర్తి : 1.51
జోగులాంబ గద్వాల : 1.50
జగిత్యాల : 1.50
నారాయణపేట్ : 1.43
వరంగల్ : 1.38
కొమ్రంభీమ్ : 1.37
వికారాబాద్ : 1.32