ఖమ్మం, ఏప్రిల్ 17: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం-కురవి జాతీయ రహదారి (ఎన్హెచ్-65ఏ) అభివృద్ధి కోసం రూ.124.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం నిర్వహించి ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు సోమవారం ఖమ్మంలో ఎంపీ నామా ఓ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం-కురవి జాతీయ రహదారిలో పెద్దతండా జంక్షన్ నుంచి పల్లెగూడెం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు, రోడ్డు మధ్యలో డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నామా పేర్కొన్నారు.
పల్లెగూడెం నుంచి ఎం వెంకటాయపాలెం రోడ్డును విస్తరించేందుకు, బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు తీసుకునేందుకు.. మొదటి ప్యాకేజీ పనులకుగాను రూ.57.52 కోట్లకు పరిపాలనాపరమైన మంజూరుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. రెండో ప్యాకేజీలో వెంకటగిరి క్రాస్ రోడ్డు నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు, ఏదులాపురం జంక్షన్ నుంచి పెద్దతండా జంక్షన్ వరకు ఉన్న రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడంతోపాటు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.67.28 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని నామా ఆ ప్రకటనలో వెల్లడించారు.