నిజామాబాద్ : రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నందిపేట మండలం చౌడమ్మ కొండూర్లో ఎమ్మెల్సీ కవిత – అనిల్ దంపతులు పునః నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆలయం అంటే ఎన్నటికీ లయం కానిదని, అవి తరతరాలకు తరగని సంపదనిస్తూ జ్ఞానాన్ని అందిస్తూ మానవజాతికి జీవనాడిగా ఉంటాయన్నారు. కోటి కొత్త ఆలయాలు నిర్మించడం కన్నా ప్రాచీన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం ధార్మికమైన కార్యమని, రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం పూర్వజన్మ సుకృతమే కాదు.. హైందవ ధర్మ పరిరక్షణలో కీలకమైన అంశమని కవిత పేర్కొన్నారు.
ఆలయ ప్రతిష్ఠాపన సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి మార్గదర్శకంలో శిలామయ, లోహమయమూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం తదితర మహాధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనలో భాగంగా ఆగమశాస్త్ర ప్రకారం.. స్తంభస్థాపన జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో క్రతువులు నిర్వహిస్తున్న ప్రధానార్చకులు నరసింహస్వామి ఉపాసకులు భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని ధార్మిక అర్చక బృందం నిర్వహించింది. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ద్వారా స్వామివారికి ఆహ్వానం పలకడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సకల దేవతలకు స్వామివారి వేడుకకు సాదరంగా ఆహ్వానించడం కోంస క్రతువులు నిర్వహిస్తారు.
ధ్వజస్తంభానికి చందనాది లేపనాలతో అభిషేకించి భక్త జనుల మధ్య అంగరంగ వైభవంగా స్థాపన కార్యక్రమం జరిగింది. వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు అనిల్ కుమార్, కిషన్ రావు, నవలత, అరుణ్, అనిత, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో విష్ణు సహస్ర నామ పారాయణం కనుల పండువగా జరిగింది. శాస్త్రోక్తంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం దీక్షాధారణ అంకురార్పణ తదితర కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. తీర్థ ప్రసాద గోష్టితో మొదటి రోజు కార్యక్రమాలు వేడుకగా ముగిశాయి. ఈ నెల 9వ తేదీ వరకు లోక కల్యాణార్థం, విశ్వశాంతి, ప్రజల ఆయురారోగ్య, ఐశ్వర్య సిద్ధి కోసం ఆరు రోజుల పాటు విశిష్ట పూజలను నిర్వహించనున్నారు.