CM KCR Public Meeting | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి పురిటిగడ్డ సిద్దిపేట. సంక్షుభిత తెలంగాణకు, కల్లోల గీతాలకు చరమగీతం పాడి ‘ఉరి’సిల్ల నుంచి సిరులఖిల్లాగా మారింది సిరిసిల్ల. రాష్ట్రంలో ఈ రెండూ వేటికవే పోటీ. అభివృద్ధి, సంక్షేమరంగాల్లో జోడెద్దుల పరుగు. అటు హరీశ్రావు, ఇటు కేటీఆర్ కృష్ణార్జునులై ప్రగతిదారుల్లో ప్రజాసైన్యాన్ని గెలిపించే గులాబీ సేనాధిపతులు. ఈ రెండు నియోజకవర్గాలంటే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం. అవి తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మాత్రమే కాదు.. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక గత వైభవదీప్తులు. కేసీఆర్తో పెనవేసుకున్న పేగుబంధపు కూడళ్లు. ఈ రెండు నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలు రాష్ట్రం లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయటాన్ని ఏ శక్తీ ఆపలేదని నిరూపించాయి.
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ‘నియోజకవర్గ ఊళ్లల్లో ఎవరైనా ఉన్నరా? మొత్తం ఇక్కడే ఉన్నరా?’ అని సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఇంటికి తాళం పెట్టి ‘ఇంటింటి రాజు లు వచ్చినట్టే’ పిల్లాపాపలతో జనం తరలివచ్చారు. తమ ఊళ్ల పేర్లను, తన సన్నిహితులు, స్నేహితుల పేర్లను సీఎం కేసీఆర్ ఉదహరిస్తున్నప్పుడు ఆయా గ్రామాల నుంచి వచ్చినవారు ఈలలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మా నవాబ్సాబ్.. తోరణాల చంద్రారెడ్డి బావ’ అని కేసీఆర్ సంబోధించటంతో సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభా ప్రాం గణం అంతా పులకించిపోయింది. రెండు సభల్లోనూ కేసీఆర్ ప్రసంగానికి జనం ఉర్రూతలూగారు. సిరిసిల్లలో ప్రసంగిస్తూ 40 ఏండ్ల క్రితం తాను ఈతకొట్టిన కాలువలు, చెరువులు, మిడ్మానేరు నుంచి సజీవ జలధారలను గుర్తుచేసుకుంటూనే, నేతన్నల ఆత్మహత్యలు, నాటి జిల్లా అధికారులు గోడల మీద రాసిన రాతలు, వాటిని చూసి చలించిన సం దర్భాలను కేసీఆర్ గుర్తుచేస్తున్నంతసేపు సభా ప్రాంగణం సైలెంట్ అయిపోయింది. సిద్దిపేటలో ‘రక్తం.. మాంసం.. బుద్ధి.. అన్నీ ఇచ్చి నన్ను కనీపెంచిన సిద్దిపేట మాతృభూమికి, కన్నతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అని సీఎం కేసీఆర్ చెప్తున్నప్పుడు ఆయన కంఠం కృతజ్ఞతాజేగంట మోగించింది. ‘నేను చిన్నపిల్లగానిగా ఉన్నపుడు అమ్మ ఆరోగ్యం దెబ్బతింటే మా ఊర్లో ఒక ముదిరాజ్ తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చి సాదింది’ అని కేసీఆర్ సిద్దిపేట ఇంటింటితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ‘దేశానికి తెలంగాణ తలమానికం అయితే.. తెలంగాణకు సిద్దిపేట తలమానికం’ అని కేసీఆర్ చెప్తుంటే సభాప్రాంగణం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది.