హైదరాబాద్ : దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం గొప్ప అదృష్టమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు.
అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీఎఫ్ తో పాటు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించటంతో పాటు, జెండా వందనంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అటవీ శాఖకు సముచిత స్థానం దక్కుతోందని, ప్రభుత్వం పర్యావరణ రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని పీసీసీఎఫ్ గుర్తు చేశారు. దీనిని శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకుని నిబద్దతతో విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో మంచి ప్రతిభ చూపిన ఉద్యోగులకు పురస్కారాలను సీనియర్ అధికారులు చేతుల మీదుగా అందించారు.