కలెక్టరేట్, ఫిబ్రవరి 29 : రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు(Pending wages) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు(Gram panchayat workers) గురువారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ఆందోళనలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాచర్ల మల్లేశం, కొప్పుల శంకర్ పాల్గొని మాట్లాడారు. కార్మికులకు వేతనాలు పెంచడంతోపాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు కార్మికుల పక్షాన మాట్లాడడం లేదని విమర్శించారు. జీవో నెంబర్ 51 ప్రకారం రూ.9,500 వేతనం మంజూరు చేయాల్సి ఉండగా, తక్కువ విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నామమాత్రపు జీతాలతో తమ కుటుంబాల పోషణ కష్ట సాధ్యమవుతుందన్నారు. కార్మికులకు ప్రతి ఏటా పంపిణీ చేయాల్సిన బట్టలు, కొబ్బరినూనె, సబ్బులు, గ్లౌజులు, పనిముట్లు, ఇతర భద్రతా పరికరాలు సత్వరమే అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘ నాయకులు వడ్లూరి లక్ష్మీనారాయణ, శనిగరపు కొమురయ్య, ఏ రవీందర్రావు పాల్గొన్నారు.