నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 29 : అకాల వర్షాలు రైతన్నను వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవుతుండటంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. శుక్రవారం అర్ధర్రాతి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు పలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, వరి, మక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. మక్కజొన్న, జొన్న, వేరుశనగ బస్తాలు తడిసిపోయాయి. నాగర్కర్నూల్ మార్కెట్లో 90 శాతం ధా న్యం తడిసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి కాయలు నేలరాలాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 35 ఎకరాల్లో వరి, 11 ఎకరాల్లో మక్క, 60 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేశారు. పిడుగుపడటంతో ఉప్పునుంతల మండలం తిప్పాపూర్లోని ఓ ఇంటి ఆవరణలోని కొబ్బ రి చెట్టు కాలిపోయింది. వంగూరు మండలంలో వడగండ్ల వాన కురిసింది. అత్యధికంగా ఊర్కొండ మండలంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోనూ వర్షం పడింది. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని శాలిగౌరారంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. యాదగిరిగుట్ట, సంస్థాన్ నారాయణపురం, మోటకొండూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పొలాలు నేలవాలాయి. జనగామ పట్టణం, వరంగల్ జిల్లా నర్సంపేట, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ మోస్తరు వర్షం పడింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది.
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. భారీ ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హిమాయత్ నగర్, ముషీరాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, నారాయణగూడ, కేపీహెచ్బీ కాలనీ, సైదాబాద్, మలక్పేట, షేక్పేట, రాయదుర్గం, కాప్రా, ఈసీఐఎల్, మారేడుపల్లి, నాచారం, మంచాల, బాలానగర్, అమీర్పేట, సూరారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హిమాయత్ నగర్లో 7.88 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాలాలో కొట్టుకుపోయి బాలిక మృతి
సికింద్రాబాద్లోని బేగంపేట్ సర్కిల్ పరిధిలోని కళాసిగూడలో శనివారం తెల్లవారు జామున పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి మౌనిక (11) మృతి చెందింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మౌనిక కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలిపారు.
మరో నాలుగు రోజులు వర్షాలు వాతావరణ కేంద్రం వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. అదే విధంగా మే 1, 2, 3వ తేదీల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని వెల్లడించింది.