సర్వీసుల కోసం ఆర్టీసీకి పౌరసరఫరాలశాఖ లేఖ
కల్లాలు, కేంద్రాల నుంచి తరలింపు సమస్యకు చెక్
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కల్లాలు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సర్వీసులను ఏర్పాటుచేయాలని కోరుతూ పౌరసరఫరాల ఆర్టీసీకి లేఖ రాసింది. ఇందుకు సుముఖత వ్యక్తంచేసిన ఆర్టీసీ అధికారులు.. ఏఏ జిల్లాలో ఎక్కడెక్కడ రవాణా సౌకర్యం అవసరం ఉన్నదో పరిశీలించి కార్గో సేవలను ఏర్పాటుచేసే చర్యలు తీసుకుంటున్నారు. యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా ఉండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోతున్నాయి. కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు కరోనా కారణంగా కాంట్రాక్టర్లు అనుకున్న స్థాయిలో వాహనాలను సమకూర్చలేకపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు పౌరసరఫరాలశాఖ కార్గో సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రైతులకు కూడా కల్లాల నుంచి కూడా ధాన్యాన్ని తరలించేందుకు వీలుగా కార్గో సేవలు అందించాలని అధికారులు యోచిస్తున్నారు.