Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 4 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్తాయి, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసింది. కొన్నిచోట్ల తమ కండ్లముందే ధాన్యం కొట్టుకుపోయింది. ఈదులుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి.
మెదక్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం చేసిన కష్టం ఒక్క వానతో నీటిపాలు అయ్యింది. సిద్దిపేట, రామాయంపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం వర్షం పాలైంది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి ఎంఎన్ఆర్ పౌల్ట్రి రేకులు కొట్టుకుపోయాయి. చేగుంటలో ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. సిద్దిపేట జిల్లా కొండపాక, కుకునూర్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొండపాక టోల్ప్లాజావద్ద పైకప్పు కూలడంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
సిద్దిపేట, రామాయంపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు లింగంపేట, బీబీపేట్, తాడ్వాయి, గాంధారి, ధర్పల్లి, సిరికొండ భారీ వర్షం కురిసింది. తుజాల్పూర్, యాడారం, బీబీపేట, మాందాపూర్, జనగామ, భవానీపేట, ధర్పల్లి మండలంలో మామిడికాయలు నేలరాలాయి. జిల్లా కేంద్రంతోపాటు లింగంపేట మండలం భవానీపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడిలో మక్కజొన్న కొట్టుకుపోయింది. మాందాపూర్లో విద్యుత్తు స్థంబాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అశ్వాపురం, మధిర, దమ్మపేట మండలాల్లో నష్టం అధికంగా ఉన్నది. పలుగ్రామాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యంతో కాంటాలు కాకపోవడంతో ధాన్యం తడిసింది. అశ్వాపురం మార్కెట్యార్డులోని ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది.
ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంలో తల్లపురెడ్డి రాధమ్మ(58)పశువులను మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్లో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కలకుంట్ల రాజు, గోప వివేక్, గోప రంజిత్, గోప హేమలత, గోప కవిత కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కుప్పనూర్చేందుకు వెళ్లగా భారీ వర్షంతో అక్కడే ఉన్న చెట్టుకింద నిలబడగా ఈ ఘటన చోటుచేసుకున్నది. వారిని కామారెడ్డి దవాఖానకు తరలించారు.