హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఎస్ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఎంసీహెచ్ఆర్డీలో జరిగే ఈ సమీక్షకు జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ డీఎంలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.
ఈ సమీక్షలోనే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధి విధానాలను ఖరారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించనున్నారు. సీఎం అనుమతించగానే కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, కనీసం కోటి టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గన్నీ సంచుల సేకరణకు చర్యలు ప్రారంభించారు.