ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఏఎంసీ నూతన పాలక వర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్యతో పాటు పాలక వర్గ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోలుపై పీఎం మోదీ అనేక ఆంక్షలు పెట్టారు. రైతులు నష్ట పోకుండా సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకునేది తమ ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆయన కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదని మంత్రి విమర్శించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, డీఎంఓ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.