నిర్మల్ :ఈ నెలాఖరు లోగా యాసంగికి సంబంధించి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ యాసంగిలో లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 10 బాయిల్డ్, 33 రా రైస్ మిల్లులు మొత్తం 43 రైస్ మిల్లులు ఉన్నాయని పేర్కొన్నారు. 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 86 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటివరకు 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరాలను వెల్లడించారు.
వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా కొనుగోలును పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు వారంలోగా పేమెంట్ జరిగేలా చూడాలన్నారు. అధికారులు ప్రతి రోజు ఫీల్డ్లో ఉండాలని తమ పరిధిలో ఉన్న అన్ని కల్లాలలో వంద శాతం కొనుగోలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి రైస్ మిలర్లు, ట్రాన్స్ఫోర్ట్ అధికారులతో కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడుస్తున్నాయా? సమస్యలు ఏమైన ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారప్ ఫారుఖీ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే ముధోల్ విఠల్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.