హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్స్కిల్డ్ కార్మికులకే ప్రయోజనకరంగా ఉందని, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ కార్మికులకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కూనంనేని, జాన్వెస్లీల నేతృత్వంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు రేవంత్రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావును హత్యచేసి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగాల భర్తీ, ఫ్యూచర్ సిటీ భూ సేకరణలో దళితులకు అన్యాయం జరుగకుండా పరిహారం ఇవ్వాలని, రామోజీ ఫిల్మ్సిటీ పరిధిలో పేదలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం కార్యదర్శి జాన్వెస్లీ కోరారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. రేవంత్ను కలిసిన వారిలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీ సాగర్, మల్లు లక్ష్మి, సీపీఐ ప్రతినిధులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చాడ వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఈటీ నరసింహ, భాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వీఎస్ బోస్ తదితరులు ఉన్నారు.