ఆలేరు, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్మించిన ప్రాజెక్టులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో 8 సొసైటీల ద్వారా 4,558 మంది రైతులకు రూ.15.11 కోట్ల రుణమాఫీకి సంబంధించిన మంజూరు పత్రాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 108 సొసైటీల ద్వారా 35 వేల మంది రైతులకు రూ.145.30 కోట్ల రుణం మాఫీ చేశామని తెలిపారు.
ఉమ్మడి ఏపీలో నిత్యం రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు జాతీయ స్థాయిలో నాయకులు అవహేళన చేసేవారని, ఇప్పుడు తెలంగాణలో ఏ అద్భుతం జరిగింది? రైతుల ఆత్మహత్యలను ఎలా అరికట్టారని ఆశ్చర్యపోతూ.. కితాబునిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆసియాలోనే అతి పెద్ద బాహుబలి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు జలాలు అందించినట్టు చెప్పారు. మరో భారీ సాగు, తాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డి పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా, ఈ నెల 16న ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్టు వెల్లడించారు. 2014 కంటే ముందు ఆలేరు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేదని, 2023లో 1,50,500 ఎకరాలు సాగులోకి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 2014-15లో 131 లక్షల ఎకరాలు, 2022-23లో 220 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్టు తెలిపారు. మంచి చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ మళ్లీ గెలువడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.