Minister Koppula Eshwar | దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మలక్పేట దివ్యాంగుల సంక్షేమ భవన్లో సోమవారం క్వాల్ కం అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు దాదాపు రూ.1.60కోట్ల విలువైన ఎనిమిది రెస్క్యూ ఎమర్జెన్సీ వాహనాలు, రూ.40 లక్షల విలువగల 50 బ్యాటరీ వీల్ చైర్లు, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంధ విద్యార్థులకు రూ.76.14లక్షల విలువైన 150 జా సాఫ్ట్ వేర్తో కూడిన లాప్టాప్స్ను, 4జీ స్మార్ట్ సెల్ఫోన్స్ 75 ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దివ్యాంగులకు ప్రాధాన్యం కేటాయిస్తూ వారికి అధిక నిధులు వెచ్చించి అనేక ఉపకరణాలు అందిస్తున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. వివిధ కంపెనీల సహాయంతో సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఏ సహాయ ఉపకరణాలు అందించినవి వందశాతం ఉచితంగా అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగుశాతం, సంక్షేమ పథకాల్లో శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా క్వాల్ కం అండ్ నిర్మాన్ సంస్థ ధన్యవాదాలు తెలిపారు.
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్ది మాట్లాడుతూ దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటివరకు సంస్థ ద్వారా రూ.46.26 కోట్లతో 50, 845 లబ్ధిదారులకు 17 రకాల సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామని గుర్తు చేశారు. ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న విధంగా దివ్యాంగుకలు అండగా ఉంటామని ముందుకు వచ్చి గొప్ప మనసును చాటుకున్న కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సీనియర్ సిటిజన్స్, వికలాంగుల కాల్ సెంటర్స్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సంస్థ ఎండీ శైలజ, క్వాల్ కం సీఈఓ నితిన్ శర్మ, కృష్ణకుమారి, నిర్మాన్ సంస్థ సంస్థ సీఈవో మయూరు పట్నాల, భార్గవ్ సంస్థ జీఎం ప్రబంజన్ రావు, ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.