హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వయోధిక పాత్రికేయులు తమకు ప్రభుత్వం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను వయోధిక జర్నలిస్టులు మీడియా అకాడమీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ జంట నగరాలలో దాదాపు 400 మంది, జిల్లాల్లోనూ చాలామంది వయోధిక పాత్రికేయులు ఉన్నారని, వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారా అందిస్తే, తమకు అవసర సమయాల్లో చికిత్స సౌకర్యం సమకూరుతుందని తెలిపారు.
ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తంలో 25 శాతం భరించటానికి తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. వారి అభ్యర్థనపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిషారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు, కార్యదర్శి లక్ష్మణరావు, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు.