హైదరాబాద్, ఫిబ్రవరి 23 : ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం పక్కగా అమలుకు వివిధ ప్రభుత్వశాఖల్లోని పది ఇంజినీరింగ్ విభాగాలను ఎంపికచేశారు. ఆయా విభాగాలకు మండలాలను అప్పగించారు. జిల్లాల కలెక్టర్లు మండలానికి ఒక ఏజెన్సీని ఎంపికచేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 594 మండలాలను 10 ఇంజినీరింగ్ విభాగాలకు కేటాయించారు. అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు 258 మండలాలను అప్పగించారు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈడబ్యూఐడీసీ)కు 124 మండలాలు కేటాయించారు. ఈ పథకం కింద తొలివిడతలో 9,123 స్కూళ్ల సమగ్రాభివృద్ధికి రూ.3497.54 కోట్లను ఖర్చు చేయనున్నారు. మండలం యూనిట్గా పథకాన్ని అమలుపరిచే బాధ్యతను ఒకే ఇంజినీరింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఒక మండలంలో ఎన్ని పాఠశాలలు ఎంపికైతే వాటి అంచనాల రూపకల్పన, పనుల నిర్వహణ, పర్యవేక్షణ అంతా ఆ ఏజెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ ఏజెన్సీ అధికారులకు ఈ నెల 24న తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెండ్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తారు.
ఇంజినీర్ల కోసం ప్రత్యేక కరదీపిక
ఈ పథకం అమలులో ఇంజినీర్ల పాత్ర కీలకం. అంచనాల రూపకల్పన, టెక్నికల్ అనుమతులివ్వడం, పనుల పర్యవేక్షణ అంతా ఇంజినీనర్లదే. రూ.35 లక్షలలోపు అంచనాలను నామినేషన్ పద్ధతిలో, అంతకు మించిన అంచనాలకు టెండర్లు పిలబడం ఇంజినీన్ల బాధ్యత. నిధుల విడుదల కోసం చెక్కులపై ఇంజినీర్ల సంతకాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి ఇంజినీర్ల కోసం ప్రత్యేక కరదీపిక (హ్యాండ్బుక్)ను అధికారులు సిద్ధం చేశారు. విద్యాశాఖ రూపొందించిన నిర్దిష్ట ప్రమాణాలు, అంచనాలు, డిజైన్ల ప్రకారం పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీల్డ్ ఇంజినీర్ల కరదీపికను అధికారులు తయారుచేశారు. కరదీపిక ప్రకారమే నడుచుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
ఇంజినీర్లు అంచనాలు రూపొందించేవి