రాయపర్తి/పర్వతగిరి, జూలై 27 : రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ నేతృత్వంలో రాయపర్తి, పర్వతగిరి మండల కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిలైట్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, వరంగల్ కలెక్టర్ బీ గోపీతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రూ.300 కోట్లతో రాష్ట్రంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పల్లెలన్నీ విద్యుత్తు కాంతులతో మెరుస్తాయని, కరెంటు బిల్లులు ఆదా అవుతాయన్నారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీల నేతలకు గుండెల్లో గుబులు పుడుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలకు అడ్డుపుల్లలు పెట్టడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.