Revanth Reddy | న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై సుమారు గంటన్నర పాటు చర్చించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన యూపీఎస్సీ.. పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తోందని.. ఒక్క అవినీతి మరక అంటలేదని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలంగా ఇంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై సీఎం ఆరా తీశారు.
తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలని అనుకుంటున్నట్లు యూపీఎస్సీ చైర్మన్కు సీఎం వివరించారు. నియామకాల ప్రక్రియపై దృష్టిసారించిన సీఎం రేవంత్రెడ్డిని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మనోజ్ సోని అభినందించారు. యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని అనుకుంటున్నందున టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని తెలిపారు. సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.