‘నా భార్యను మొదటి ప్రసవం కోసం పుట్టింటికి పంపితే.. గిట్లా సర్కార్ దవాఖానకు తీసుకొస్తరా? నా పెడ్లాం పిల్లల్ని సంపాలని సూస్తున్నరా ఏంది? ఇప్పుడు ప్రైవేట్కు తీసుకపోతరా.. లేదా?
– గతంలో ప్రభుత్వ దవాఖాన ముందు ఓ భర్త వాదన ఇది.
‘పురుడు కోసం ఈ ప్రైవేట్ దవాఖానకు ఎందుకు వచ్చిన్రు? ఇక్కడ పైసలు గుంజుడు తప్ప ఏం ఉండది. గవర్నమెంట్ దవాఖానల మస్తు మంచిగ డెలివరీలు అయితున్నయి. మీదికెల్లి పైసలు వస్తయి. అక్కడికే పోదాం నడువుర్రి’
– ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వద్ద ఓ భర్త చేసిన వ్యాఖ్యలు ఇవి.
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
Deliveries in Govt hospitals | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్రవ్యాప్తంగా 69% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. సంగారెడ్డి జిల్లా 87% ప్రభుత్వ దవాఖానల ప్రసవాలతో కొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు నమోదయ్యాయి. సంగారెడ్డితోపాటు నారాయణపేట జిల్లాలో 83%, మెదక్లో 82%, జోగులాంబ గద్వాలలో 81% మంది గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే సురక్షితంగా ప్రసవాలు చేయించుకున్నారు. వైద్యసిబ్బంది మొత్తం కుటుంబసభ్యుల మాదిరిగా ఆత్మీయ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి వాహనాలు వంటి పథకాల ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది. ఇదే సమయంలో అత్యాధునిక వసతులతో దవాఖానలను బలోపేతం చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి.
2014లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతమే ఉండేవి. ప్రతి వంద మంది గర్భిణుల్లో 30 మంది ప్రభుత్వ దవాఖానకు వస్తే.. 70 మంది ప్రైవేట్కు వెళ్లేవారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో సగటున రాష్ట్రంలోని ప్రతి వంద మంది గర్భిణుల్లో 69 మంది పురుడు కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. 31 మంది మాత్రమే ప్రైవేట్ను ఆశ్రయించారు. 16 జిల్లాల్లో ప్రభుత్వ దవాఖాన ప్రసవాలు 70 శాతానికిపైగా నమోదు కావడం విశేషం. రాజధాని హైదరాబాద్లో గల్లీకో ప్రైవేట్ దవాఖాన ఆకర్షిస్తున్నా.. 77% మంది గర్భిణులు ప్రభుత్వ దవాఖానపై నమ్మకం ప్రదర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 70% మంది ప్రభుత్వ దవాఖానలకే వెళ్లారు. నగరీకరణ అధికంగా ఉన్న సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు కూడా 70% క్యాటగిరీలో ఉండటం విశేషం.
సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన అంశాల్లో మాతాశిశు సంరక్షణ ఒకటి. అప్పట్లో మాతృమరణాల రేటు (ఎంఎంఆర్) 92, శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 39గా ఉండేది. ఈ దుస్థితిని మార్చాలనే లక్ష్యంతో తొలుత కేసీఆర్ కిట్ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంతో బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలు ఆర్థిక సాయం అందుతున్నది. కచ్చితంగా నాలుగుసార్లు ఏఎన్సీ చెకప్ జరుగుతున్నది. అమ్మ ఒడి వాహనాల ద్వారా సురక్షిత ప్రయాణం, ఆరోగ్యలక్ష్మి ద్వారా పోషకాహారం, రక్తహీనత నివారణకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తున్నది. టిఫా స్కానింగ్ యంత్రాల ద్వారా బిడ్డ ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. మరోవైపు దవాఖానల్లో లేబర్రూంల ఆధునికీకరణ, ఎంసీహెచ్ల ఏర్పాటు, గైనకాలజిస్టులకు శిక్షణ, ప్రోత్సాహకాలు అమలవుతున్నాయి. ఇవన్నీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. తొమ్మిదేండ్లలోనే 70% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడమే ఇందుకు నిదర్శనం.
మాతాశిశు సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ గొప్ప విజన్, ఆయన మార్గనిర్దేశనంలో అమలు చేసిన కార్యక్రమాల ఫలితమే ఇది. 2014లో 30% ఉన్న ప్రభుత్వ దవాఖాన ప్రసవాలు 2022-23 నాటికి 62 శాతానికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 69% ప్రసవాలతో తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలోనే అత్యధిక ప్రభుత్వ దవాఖాన ప్రసవాలతో కొత్త చరిత్రను లిఖించింది. నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా, ఏకంగా 16 జిల్లాల్లో 70 శాతానికిపైగా ప్రసవాలు జరగడం హర్షనీయం. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
– హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ప్రభుత్వం ఒకవైపు వసతులు పెంచి, మరోవైపు కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేస్తుండటంతో గర్భిణుల్లో నమ్మకం పెరిగింది. జిల్లాలో గర్భిణీ సేవలపై ప్రతి దశలోనూ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. పీహెచ్సీల వారీగా ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా గర్భిణులు చెకప్కు రాకపోయినా, ప్రైవేట్కు వెళ్తున్నారని తెలిసినా వెంటనే ఆశ కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నారు. అవసరమైతే వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతుల గురించి వివరిస్తూ, ఇక్కడ ప్రసవాల వల్ల కలిగే లాభాలు వివరిస్తున్నారు. అన్ని దవాఖానల్లో గర్భిణులకు సేవలందించే వైద్యులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఏ అనుమానం వచ్చినా, ఎవరినైనా రెఫర్ చేసినా వెంటనే గ్రూప్లో చెప్తున్నారు. మేం ఫాలోఅప్ చేస్తున్నాం. అందరి కృషి ఫలితంగా ఏప్రిల్లో 87 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి.
– గాయత్రీదేవి, డీఎంహెచ్వో, సంగారెడ్డి