Jadcherla | మహబూబ్నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మం డలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. దీంతో మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూ సిన బంధువులకు ఓ కుక్క మృతదేహాన్ని పీక్కుతినడం కనిపించింది.
కుటుంబీకులు ఈ ఘటనను వీడియో తీసి, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇంత ఘోరమైన పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. దవాఖాన వైద్యులు, సిబ్బంది వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ కమలాకర్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని కొత్త దవాఖాన మార్చురీకి తరలిస్తామని తెలిపారు. దామోదర రాజనర్సింహ ఇన్చార్జి మం త్రిగా ఉన్న జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.