కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులకే వర్తింపు
సర్వీసు నిబంధనలను మార్చిన రాష్ట్ర సర్కారు
ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి పాత నిబంధనలు
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నిషేధం విధించింది. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు సైతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వీస్ రూల్స్లో మార్పులు చేసి, మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విద్య సంచాలకుడి విజ్ఞప్తి మేరకు నిబంధనలను మార్చుతున్నట్టు పేర్కొన్నది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు మాత్రం ప్రాక్టీస్లో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి (డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా బదిలీ ద్వారా) కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. ప్రైవేట్ ప్రాక్టీస్ వల్ల వారు విధులు సరిగా నిర్వహించడం లేదని, ప్రభుత్వ దవాఖానల్లో నిర్దిష్ట సమయం గడపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పేదలకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం దృష్టికి రావడంతో తీవ్రంగా చర్చించి, ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సిద్ధం చేసిన ఫైల్పై ఇటీవలే సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.
నిమ్స్లో అమలవుతున్నదే
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దనే నిబంధన దేశవ్యాప్తంగా అనేక చోట్ల అమలవుతున్నది. నిమ్స్లో ఎప్పటి నుంచో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేరే వైద్యులు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు. వైద్యారోగ్య శాఖలో సుమారు 12,755 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో 10,028 పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. తొలిదశగా మరో వారం రోజుల్లో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, తర్వాత ప్రతి వారం ఒక నోటిఫికేషన్ ఉంటుందని మంత్రి హరీశ్రావు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వీస్ రూల్స్ మార్పు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.