అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు
అందరికీ తెలిసేలా చర్యలు
అన్ని గ్రామాల్లో ఏర్పాటుకు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు చేపట్టింది. అందుకు సంబంధించిన నిధులను పంచాయతీలకు విడుదల చేసింది. వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేసింది. వీటి ద్వారా ఆయా గ్రామాలకు, ప్రజలకు చేకూరిన లబ్ధి వివరాలను బోర్డుల్లో పొందుపరుస్తారు. గ్రామ పంచాయతీలకు గతంలో ఎన్ని నిధులు వచ్చేవి? ‘పల్లె ప్రగతి’ ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు విడుదల చేసింది? ఆ పంచాయతీ సొంతగా ఎన్ని నిధులను ఖర్చు చేసింది? అనే వివరాలను బోర్డులో పేర్కొంటారు.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్షి, కేసీఆర్ కిట్లు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల ద్వారా ఎంత మంది ఎంత ప్రయోజనం పొందారన్న వివరాలనూ బోర్డులో చేరుస్తారు. ‘పల్లె ప్రగతి’ కింద చేపట్టిన వైకుంఠ ధామాలు, డంపింగ్ షెడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్తు సరఫరా తదితర పనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ బోర్డుల్లో కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా గ్రామాలకు అందుతున్న నిధులపై ప్రజల్లో అవగాహన పెరిగి దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నిధుల వివరాలు ఎప్పటికప్పుడు మారే అవకాశాలు ఉండటంతో తాత్కాలికంగా రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొద్ది కాలం వరకే ఉంటున్నాయని గుర్తించిన పంచాయతీరాజ్ అధికారులు.. నిధుల వివరాలను గోడపై రాయించాలని ఆదేశాలు జారీ చేశారు.