Jowar Procurement | రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్నల (హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మార్క్ఫెడ్ ఎండీకి సూచించింది.
యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న సాగు చేసిన దాదాపు లక్షల మంది ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనున్నది.