హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఓ బిల్లును తిరస్కరిస్తూ, మరో రెండు బిల్లులపై వివరణ కోరుతూ తిప్పి పంపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మొత్తం 10 బిల్లులపై గవర్నర్ తమిళిసై కొన్ని నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. కనీసం కారణం కూడా చెప్పలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 2న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 10న విచారణ జరిగింది. అప్పటివరకూ బిల్లులను పెండింగ్ పెట్టిన గవర్నర్.. విచారణ రోజే మూడు బిల్లులను ఆమోదించారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. మరో రెండు బిల్లులకు సంబంధించి వివరణ కోరుతూ తిప్పి పంపారు. మిగతా మూడు బిల్లులను మళ్లీ పెండింగ్లో పెట్టారు.
ఇందులో ముఖ్యమైన ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు-2022, ది తెలంగాణ మున్సిపల్ లాస్ సవరణ బిల్లు-2022 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం మరోసారి విచారణ జరిగింది. దీంతో గవర్నర్ మరోసారి హడావుడిగా నిర్ణయాలు తీసుకొన్నారు. డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) సహా వైద్య విద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును తమిళి సై తిరస్కరించారు. పురపాలికల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన పురపాలిక చట్ట సవరణ బిల్లు, కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిప్పి పంపారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందువల్లే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించిన నాలుగు బిల్లులను తిప్పి పంపడమంటే ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకొని, ప్రజలకు మేలు కలుగకుండా చూడటమేనని మేధావులు మండిపడుతున్నారు.