హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ప్రతిపౌరుడు తన ఓటుహక్కును బాధ్యత, అవగాహనతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్టు చెప్పారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్ష, స్వేచ్ఛాయుత, న్యాయసమ్మత ఎన్నికలకు పునాది అని పేర్కొన్నారు. అంబేడర్, గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అర్హులైన ఓటర్లకు హోంఓటింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఎన్నికలు మరింత సమగ్రంగా మారాయని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను డ్రోన్ నిఘా, పోలీసుల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించిన తీరును గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు పొందినవారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఈవో చేతుల మీదుగా అందజేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.39 కోట్లకు చేరినట్టు తెలిపారు. వీరిలో 1.68 కోట్ల మంది పురుషులు,1.70 కోట్ల మంది మహిళలు,2,890 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్టు వివరించారు. గత జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి ఇప్పటివరకు సుమారు 3.93 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరినట్టు వెల్లడించారు. ఓటరు జాబితా సవరణ లక్ష్యం ఓటర్ల తొలగింపు కాదని, ద్వంద్వ, అనర్హుల నమోదు తొలగింపేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని, అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డిప్యూటీ సీఈవో హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
