నల్లగొండ : వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 72శాతం కొనుగోళ్లు పూర్తి చేశారని చెప్పారు. వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయని, ధాన్యం తడవడం వల్ల తిరిగి ఆరబెట్టుకుని అమ్ముకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
గవర్నర్ తమిళిసై బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ముందుగా పట్టణంలోని షేర్బంగ్లాలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయాన్ని పునఃప్రారంభించారు. ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అక్కడి నుంచి పట్టణ శివారులోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులతో గవర్నర్ మాట్లాడారు. చర్లపల్లికి చెందిన రైతు మందడి మధుసూదన్రెడ్డిని పలుకరిస్తూ.. ఎక్కడి నుంచి వచ్చావు? వడ్లు తెచ్చి ఎన్ని రోజులు అవుతుందని అడిగారు. ‘మాది చర్లపల్లి ఊరు అని, 10 రోజుల కిందట వడ్లు తెచ్చాన’ని రైతు జవాబిచ్చాడు. ఎన్ని బస్తాలు తెచ్చావు అంటే 110 బస్తాలు అన్నాడు. వర్షాలతో ఇబ్బందులు వచ్చాయా? అంటే.. వచ్చాయి.. కానీ ఈ సారి మంచిగనే కొన్నారని రైతు మధుసూదన్రెడ్డి తెలిపారు.
తర్వాత పక్కనే ఉన్న పానగల్కు చెందిన మహిళా రైతు మల్లమ్మను గవర్నర్ పలుకరించారు. ‘నేను ఎవరో తెలుసా అని గవర్నర్ అడగ్గా.. నాకు పేరు తెల్వదని మల్లమ్మ బదులిచ్చింది. దీంతో నా పేరు డాక్టర్ తమిళిసై, నేను గవర్నర్ను అని నవ్వుతూ బదులిచ్చారు. నేను మిమ్మల్ని కలువాలని వచ్చాను.. ఏమైనా సమస్యలు ఉన్నాయా?’ అని అడిగారు. వర్షాలతో వడ్లు తూకం తక్కువ వచ్చాయని మల్లమ్మ తెలిపింది. ఎన్ని బస్తాల వడ్లు తెచ్చావని ప్రశ్నిస్తే.. రెండు ఎకరాలు పెట్టినం. 93 బస్తాలు అయినయ్.. వర్షాలతో ఇబ్బందులు పడ్డామని మల్లమ్మ వివరించింది. ఇప్పుడు వడ్లు పెట్టాల్నా.. వద్దా తెలుస్తలేదని మల్లమ్మ అడుగుతుండగా… గవర్నర్ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.. వస్తానంటూ అక్కడి నుంచి కదిలారు.
అక్కడి నుంచి తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు. అక్కడ కె.మారయ్య, ఎన్.తిరుపతయ్య అనే రైతులతో మాట్లాడారు. వడ్లు తెచ్చి ఎన్ని రోజులైంది.. ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అని ప్రశ్నించగా 15 రోజులైంది.. వడ్లు కొన్నారు. ఇబ్బందులు ఏమీ లేవని రైతులు బదులిచ్చారు. తరువాత కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ గన్నీ బ్యాగులు సరిపడా ఉన్నాయా? ఎంత మంది రైతులు ధాన్యం తెచ్చారు? అని ఆరా తీశారు. అనంతరం అక్కడే కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న ఐకేపీ మహిళలతో ఫొటో దిగారు. ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకృతిపరంగా వర్షాలే రైతులను ఇబ్బందులకు గురి చేశాయని పేర్కొన్నారు.