హైదరాబాద్: నిత్యజీవితంలో యోగా (Yoga) ఒక భాగంగా మారాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని.. అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయని చెప్పారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్డౌన్ పేరుతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలి రాజ్, సినీ నిర్మాత దిల్ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.