హైదరాబాద్: పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్లో ఉండాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాలని యువతకు సూచించారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలన్నారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటు వేయకపోతే చనిపోతాం.. అని ఓ అభ్యర్థి చెప్పడం సరైన పద్ధతి కాదని, ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దని తెలిపారు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మధ్య వారధిగా ఉండటం తన బాధ్యత అని వెల్లడించారు. తొలిసారి హోం ఓటింగ్ మంచి పరిణామమన్నారు. ఓటింగ్ రోజు సెలవు సరదా కోసం కాదని యువత గుర్తించుకోవాలని వెల్లడించారు. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్లు అనుకోవాలని.. ఓటర్ మార్క్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నారు. ఓటర్ అనే వ్యక్తి తప్పకుండా ఓటు వేయాలని, ఈవీఎం బాక్స్పై నోటా అనే ఆప్షన్ ఉన్నప్పటికీ దానికి నేను వ్యతిరేకమని చెప్పారు.