హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోటాలో ఎమ్మెల్సీల భర్తీకి ప్రతిపాదనలు పంపించవద్దని గవర్నర్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరుగనున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ప్రతిపాదనలు స్వీకరించరాదని నిర్ణయించినట్టు రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ నిర్ణయం ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిని షాక్కు గురిచేసింది. గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది చర్చనీయాంశమైంది.