Governor Tamilisai | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బడుగులపై గవర్నర్ తమిళిసై కత్తిగట్టారు. ఉద్యమకారులుగా తెలంగాణ సమాజానికి సేవలందించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా, రాజకీయకోణంతో తిరస్కరించి, వివక్ష చూపారు. ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా అనర్హులని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వారిద్దరూ అర్హులని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జూలై 31న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, గవర్నర్ కోటాకు సరితూగే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందని, ఈ కారణంగానే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించేందుకు ప్రధాన కారణమని గవర్నర్ తమిళి సై పేర్కొనటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటమే పరమావధిగా తమిళి సై వ్యవహారశైలి ఉందని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. గవర్నర్ పదవి చేపట్టేముందు ఫక్తు రాజకీయ పదవిలో ఉన్న తమిళి సై సైతం రాజకీయాల్లో ఉన్నందునే ఇద్దరి అభ్యర్థిత్వాల తిరస్కరణకు కారణమని చెప్పటం రాజకీయం కాక మరేమిటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావచ్చుకానీ.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉంటే తప్పేమిటి? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ.. ‘రాజకీయ నాయకులను ఎమ్మెల్సీగా ఎలా నియమిస్తారు?’ అని అడగడమే విడ్డూరంగా ఉందని నిపుణులు, మేధావులు అంటున్నారు. రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవికి అనర్హులని సర్కారియా కమిషన్ విస్పష్టం చేసినా.. నవ్విపోదురుగాక అన్నట్టు తమ పార్టీల నేతలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ యథేచ్ఛగా గవర్నర్లుగా నియమిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. చరిత్ర పొడవునా ప్రత్యేకించి రాష్ట్రంలో రాంలాల్, కుముద్బెన్జోషి లాంటివాళ్లను కాంగ్రెస్ పార్టీ, తమిళి సై సౌందరరాజన్ను బీజేపీ గవర్నర్గా నియమించింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసి, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన తమిళి సైని రాష్ట్రగవర్నర్గా నియమించటం, రాజ్భవన్ను బీజేపీ అడ్డాగా చేసుకొని రాజకీయాలు చేయటమే గవర్నర్గిరీ అన్నట్టుగా తమిళి సై వ్యవహరిస్తున్నారనే విషయం రాజ్భవన్లో మూలమూలకు తెలుసని రాజకీయ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరూ రాజకీయ నేతలనే కారణంతో వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. అయితే, తమిళిసైకి తన నియామకం గుర్తులేదా? సర్కారియా కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా నియమితులైన విషయం తెలియదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాను నిన్న మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారెందరు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారెందరు? వారికి లేని రాజకీయరంగు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు మాత్రమే ఎందుకు? అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తీరు సుపరిచితమేనని, అందులో దాగిన రాజకీయ ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదని మండిపడుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ఎంతోమంది రాజ్యసభ సభ్యులుగా, ఆయా రాష్ర్టాల్లో శాసనమండలి సభ్యులుగా పనిచేస్తున్నా.. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వారే రాజకీయ నాయకులుగా కనిపించారా? అని గవర్నర్ను నిలదీశారు.
‘రాష్ర్టపతి కోటాలో రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినవారిలో రాంశకల్ ఉత్తరప్రదేశ్లో ఎంపీగా మూడుసార్లు బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వ్యవహరించారు. ఆ రాష్ర్ట బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరిగా వ్యవహరించారు. రాష్ర్టపతి కోటాలో కేంద్రం ఎంపికచేసిన వారిలో ఒకరైన మహేశ్ జెఠ్మలాని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొనసాగిన మాట వాస్తవం కాదా? ఆర్ఎస్ఎస్ నేతగా దేశంలో సుపరిచితులుగా ఉన్న రాకేశ్ సిన్హా, జమ్ముకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన గులాం అలీ ఖతనా లాంటి ఎంతోమంది రాజ్యసభ సభ్యులుగా కొనసాగడం లేదా? బీజేపీలో పనిచేసిన నేతలు రాజ్యసభ సభ్యులుగా ఉంటే తప్పులేదుగానీ.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు మాత్రమే రాజకీయ పార్టీ రంగు అంటిందా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్లో జితిన్ ప్రసాద, చౌదరీ విజేంద్రసింగ్, సంజన్ నిషాద్ తారిఖ్, మన్సూర్ వంటి ఎంతోమంది నేతలు బీజేపీ నేతలు కాకుండానే ఆ రాష్ర్ట ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఉన్నచోట గవర్నర్లు.. ఆయా శాసనమండళ్లకు బీజేపీతో సంబంధంలేని వ్యక్తులను, దారినపోయే దానయ్యలను తెచ్చి ఎమ్మెల్సీలుగా చేస్తున్నారు కానీ, తెలంగాణలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తన పార్టీతో సంబంధం ఉన్నవారిని మాత్రమే ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తున్నదా? అని గవర్నర్ తమిళి సైని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ ఆమోదానికి తిరస్కరణకు గురైన నేతల రాజకీయ, ఉద్యమ నేపథ్యాలపై విస్తృత చర్చ సాగుతుండటం విశేషం.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించటమే కాకుండా ఉన్నత విద్యావంతుడిగా ఉన్న దాసోజు శ్రవణ్ ఎంపికకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభ్యంతరం పెట్టడంలో ఆంతర్యం ఏమిటో అంతుచిక్కటం లేదని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ప్రపంచస్థాయి కంపెనీలకు మానవ వనరుల విభాగం అధిపతిగా పనిచేసిన అరుదైన తెలంగాణ వ్యక్తి దాసోజు. ఆయన ప్రపంచ ఉద్దండ కంపెనీల చైర్మన్పదవిని కాదనుకొని ప్రజాసేవలోకి వచ్చారు. వేలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలోభాగం అయ్యారు. వెనుకబడిన వర్గాల బలమైన గొంతుకగా ఎదిగిన దాసోజు శ్రవణ్ను బీఆర్ఎస్ అక్కున చేర్చుకోవడం, ఉన్నత పదవిలో కూర్చోబెట్టడం గవర్నర్కు ఇష్టంలేకే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ దేశ రాజకీయాల్లో సృష్టించిన నవీన విప్లవంలో భాగస్వాములై ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామి అయిన కుర్రా సత్యనారాయణ జనాతా పార్టీలో చేరారు. సంగారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. బాబూ జగ్గీవన్రాంను ప్రధాన మంత్రిని చేయాలని బీజేపీ చేసిన రాజకీయ ఎత్తుగడతో ఆ పార్టీకి ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1999లో టీడీపీ-బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా సంగారెడ్డి అసెంబ్లీ స్థానం బీజేపీకి వచ్చింది. జనరల్ స్థానం నుంచి కుర్రా సత్యానారాయణ బీజేపీ అభ్యర్థిగా గెలిచి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి 2018 దాకా ఆయన బీజేపీలోనే పనిచేశారు. బీజేపీలో పెడధోరణులు, ఆ పార్టీ వీడిన సిద్ధాంత వైరుధ్యాలు, కేంద్రం అనుసరిస్తున్న తెలంగాణ వైఖరికి నిరసనగా ఆయన బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమాజంలో అల్ప సంఖ్యాకులుగా ఉన్న కుర్రా సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం గవర్నర్కు నచ్చకపోవడం గమనార్హం.