హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ బీ జనార్దన్రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, కారం రవీందర్రెడ్డి, ఆర్ సత్యనారాయణ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో డిసెంబరులో వీరందరూ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీలోని మిగతా సభ్యులైన సుమిత్రానంద్ తనోబా, కోట్ల అరుణకుమారి రాజీనామా చేయకపోవడంతో వారు సభ్యులుగా కొనసాగుతారు. రాజీనామాలను ఆమోదించకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారని, దాంతో ఉద్యోగాల భర్తీపై నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామంటూ మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ గవర్నర్కు లేఖ రాశారు.
ఆమోదంలో జాప్యంలేదు
జీవన్రెడ్డి లేఖపై రాజ్భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. రాజీనామాలపై వివరణ కోరి నిబంధనల ప్రకారం వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపినట్టు తెలిపింది. సిట్ దర్యాప్తు నేపథ్యంలో న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్కు సీఎం ద్వారా ఫైల్ పంపినట్టు వివరించింది. ఈ ఫైల్ మంగళవారం తిరిగి రాజ్భవన్కు చేరడంతో బుధవారం గవర్నర్ ఆ మోదించారని పేర్కొన్నది. రాజ్యాంగం ప్రకా రం న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని కాపాడేందుకు గవర్నర్ కట్టుబడి ఉన్నారని రాజ్భవన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదించినందున ప్రభుత్వం త్వరలోనే కమిషన్కు చైర్మన్ను నియమించనున్నది. ప్ర స్తుతం ఇద్దరు సభ్యులు ఉండగా మరో 8 మందిని నియమించే అవకాశం ఉన్నది.