హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలంటూ సీఎం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని సీఎం ఆకాంక్షించారు.
స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయండి : గవర్నర్
ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. దీపాల పండుగ చెడుపై ధర్మానికి విజయమన్నారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.