హైదరాబాద్ : రాష్ట్రంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని భావితరాలకు అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్ పేట లోని మెట్ల బావి, పరిసరాలలో మున్సిపల్ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
మెట్ల బావి, నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ ను పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట మెట్ల బావి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ బావిని నిజాం కాలంలో అప్పటి స్థానిక ప్రజల త్రాగునీటి అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పారు. బావిలో 500 టన్నుల కు పైగా పూడికను తరలించడానికి 6 నెలల సమయం పట్టిందని వెల్లడించారు.
ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచన తో బావి పరిసరాలలో అనేక అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సాహె స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు కల్పన, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, అధికారులు తదితరులు ఉన్నారు.
5న మంత్రి కేటీఆర్తో ప్రారంభం
మెట్ల బావిని ఈ నెల 5 వ తేదీన మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.