డాక్టర్ గారు.. రేపు ఉదయం 10:45 గంటలకు మంచి ముహూర్తం ఉన్నదని మా పంతులు చెప్పారు. ఆ సమయానికి ఆపరేషన్ చేయండి.. ఓ భర్త మూఢనమ్మకం ఆ పేషెంట్ మనవాళ్లే. ప్రసవ తేదీకి వారం ముందే సిజేరియన్ చేయమని అడిగితే కుదరదని అన్నారట. గాంధీ జయంతి రోజే బిడ్డ పుట్టాలన్నది వాళ్ల కోరిక. కాబట్టి కాదనకుండా ఏర్పాట్లు చేయండి.. ఓ రాజకీయ నాయకుడి రికమెండేషన్ మేడమ్.. నా బిడ్డ చాలా సున్నితం. పురిటి నొప్పులు భరించలేదు. కాబట్టి సిజేరియన్ చేయండి.. ఓ తల్లి విన్నపం నాకు నాలుగైదు గంటలు పురిటినొప్పులు భరించే ఓపిక లేదు. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను తర్వాత చూసుకొంటాను. ఇప్పుడైతే సిజేరియన్ చేయండి.. ఓ గర్భిణి డిమాండ్
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్: సిజేరియన్ల వల్ల భవిష్యత్తులో తల్లుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా కొందరిలో మార్పు రావటంలేదు. అన్నీ తెలిసిన విద్యావంతులే ‘కడుపుకోత’కు (సిజేరియన్లు) మొగ్గు చూపుతున్నారు. తేదీలు, ముహూర్తాలంటూ మూఢ నమ్మకాలలో మునిగితేలుతున్నారు. దీంతో రాష్ట్రంలో సిజేరియన్ల శాతం దాదాపు 60 శాతం ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రమాణాల ప్రకారం ప్రసవాల్లో 10 శాతం మాత్రమే సిజేరియన్లు ఉండాలి. దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా దృష్టి పెట్టారు. వరుస సమీక్షలు నిర్వహిస్తూ సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు స్పష్టం చేస్తున్నారు.
సిజేరియన్లు పెరగడానికి తామే కారణమన్న అపోహ పెరిగిపోయిందని, ఇది తప్పు అని వైద్యులు అంటున్నారు. సాధారణ ప్రసవం చేయాలని ఎంత ప్రయత్నించినా, సిజేరియనే కావాలంటూ కొందరు భార్యాభర్తలు, వారి కుటుంబసభ్యులు మొండిపట్టు పడుతున్నారని అంటున్నారు. సాధారణ ప్రసవం చేయాలంటే డాక్టర్లు, సిబ్బంది కనీసం ఐదారు గంటలు శ్రమించాలి. సీ-సెక్షన్ అయితే గంటసేపట్లో పూర్తవుతుంది. దీంతో కొందరు వైద్యులు డబ్బు కక్కుర్తితో సిజేరియన్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఒకప్పుడు గర్భం ధరించింది మొదలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మహిళలను సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసేవారు. ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ‘మా బిడ్డ సున్నితంగా పెరిగింది. నొప్పులు తట్టుకోలేదు’ అని చెప్పే తల్లిదండ్రులు, ‘మా ఆవిడ కష్టపడటం చూడలేను’ అని ఒత్తిడి తెచ్చే భర్తలు, ‘వామ్మో ఐదారు గంటలు నొప్పులు పడటం నావల్ల కాదు. సిజేరియన్ చేయండి’ అని డిమాండ్ చేసే గర్భిణులు పెరిగిపోయారని డాక్టర్లు అంటున్నారు.
దవాఖాన ప్రసవాల్లో.. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖాన ప్రసవాల్లో రాష్ట్రం ఆదర్శంగా ఉన్నా సిజేరియన్లు పెరగటానికిగల కారణాలపై మంత్రి హరీశ్రావు నివేదికలు తెప్పించుకొన్నారు. సిజేరియన్లు తగ్గించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రోత్సాహకాలు: ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం సిజేరియన్కు రూ.11వేల ఇన్సెంటివ్ ఇస్తున్నారు. సాధారణ కాన్పులకు ఇవ్వడం లేదు. ఇకపై సిజేరియన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని, సాధారణ ప్రసవం అయితే కొంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సీ-సెక్షన్లపై ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఎందుకు సిజేరియన్లు చేస్తున్నారో వివరాలన్నింటినీ పక్కాగా రికార్డు చేయాలని ఆదేశించింది. ఎక్కువగా సీ సెక్షన్లు నమోదవుతున్న దవాఖానల యాజమాన్యాలు, గైనకాలజిస్టులకు మొదటగా వాటిని తగ్గించాలని సూచించనున్నారు. అయినా ఫలితం కనిపించకపోతే దవాఖాన లైసెన్స్ను కొన్ని నెలలు సస్పెండ్ చేయడం, గైనకాలజిస్టుల రిజిస్ట్రేషన్ను రద్దు చేసేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.
మంచి ముహూర్తంలో పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ అందుకోసం సిజేరియన్ల వైపు మొగ్గుచూపటం ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని సందర్భాల్లో వారం ముందుగానే అపరేషన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా చేస్తే తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పినా వినడం లేదు. సంక్రాంతి, దసరా వంటి పండుగలు, ఆగస్టు 15, గాంధీ జయంతి వంటి ప్రత్యేక తేదీలు, పెండ్లి రోజు, పుట్టిన రోజు, మొదటగా కలుసుకున్న రోజు.. అంటూ ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా తమ పిల్లల పుట్టిన రోజులు ఉండాలని కోరుకునేవారు కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు.
నా దగ్గరికి వచ్చే గర్భిణులకు సిజేరియన్ వద్దని కౌన్సిలింగ్ ఇస్తుంటాను. చాలా మంది ఒప్పుకొంటారు. కొం దరు అస్సలు వినరు. రాజకీయ నాయకులతోనో, సెలబ్రిటీలతోనో ఫోన్ చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 10-20 శాతం మందికి శారీరక సమస్యలు, డెలివరీ సమయంలో ఏర్పడే ఇబ్బందుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి వస్తున్నది. సిజేరియన్ వల్ల తల్లికి, బిడ్డకు నష్టం. శరీరంలో నాలుగైదు లేయర్లు కట్ చేస్తే తప్ప గర్భాశయం నుంచి బిడ్డను బయటికి తీయలేము. ఆపరేషన్ తర్వాత ఈ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది. ఆలోగా తగిన జాగ్రత్తలు, సరైన పోషకాహారం తీసుకోకుంటే హెర్నియా, కడుపునొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. బిడ్డ పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించాల్సి ఉంటుంది. అవి అమృతంతో సమానం. సిజేరియన్ వల్ల ముర్రుపాలు పట్టించే అవకాశమే లేకుండా పోతున్నది.
– డాక్టర్ ఎస్వీ లక్ష్మి, గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్
ముహుర్తాల పేరిట సిజేరియన్ల కోసం వస్తే నిర్మొహమాటంగా వద్దని చెప్తున్నాం. పిల్లలు పుట్టే సమయమే సుముహూర్తమని సాధారణ ప్రసవాల వైపు ప్రోత్సహిస్తున్నాం. సాధారణ ప్రసవం వల్ల రక్తస్రావం తక్కువ. నాలుగైదు గంటలు కష్టపడ్డా, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పుతాయి. ఈ విషయాన్ని గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నాం. అయినా ఒత్తిళ్లు తప్పడం లేదు.
– డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని, గైనకాలజిస్టు, కరీంనగర్
పుట్టే బిడ్డ జాతకం బాగుండాలని, దోషాలు లేకుండా శుభలగ్నం నిర్ణయించుకొని పిల్లలను కనడం శాస్త్ర విరుద్ధం. భగవంతుడి సంకల్పం ప్రకారం సహజ జననకాలమే పిల్లల జన్మలగ్నంగా నిర్ధారించబడి, జాత కం, దానిఫలం సాక్షాత్కారం అవుతుంది. అంతేతప్ప జాతకం కోసం బలవంతంగా శస్త్రచికిత్స ద్వారా సంతానం పొందడం పూర్తిగా ధర్మ విరుద్ధం. బలవంతంగానైనా సరే ఫలానా ముహూర్తంలో పుడితే భోగభాగ్యాలు లభిస్తాయని అనుకోవడం అవివేకం. ఈ విషయంలో కరీంనగర్ కలెక్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– వీ గోపీకృష్ణ శర్మ, పురోహితుడు.
సాధారణ ప్రసవాల్లో నల్లగొండ జిల్లాకు చెందిన శ్వేత అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2006లో ఆమెకు నల్లగొండలోని పలు దవాఖానల్లో సాధారణ ప్రసవం చేయటానికి వైద్యులు తిరస్కరించినా, పట్టుబట్టి హైదరాబాద్లోని కోఠి మెటర్నిటీ దవాఖానలో చేరి సాధారణ ప్రసవం చేయించుకొన్నారు. 2008లోనూ మరోసారి సాధారణ ప్రసవమే జరిగింది. దీంతో పోలీస్ కావాలన్న ఆమె కలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదు. 2017లో ఎస్సైగా ఉద్యోగం సంపాదించి, ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నారు. సాధారణ ప్రసవం కావడంతో తనకు అసలు ఆరోగ్య సమస్యలే లేవని, అందువల్లే ఫిట్గా ఉండి ఉద్యోగం సాధించానని శ్వేత చెప్తున్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇటీవల జిల్లా నివేదికలను పరిశీలించగా.. 2020-21లో మొత్తం 13,077 ప్రసవాలు జరిగితే ఏకంగా 10,312 సిజేరియన్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో అత్యధికం ప్రైవేటు దవాఖానల్లోనే జరిగినట్టు తేలింది. దీంతో కారణాలను లోతుగా విశ్లేషించి ముందుగా ముహూర్తాల ప్రసవాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇటీవలే పురోహితులు, గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించి ఎవరైనా తల్లిదండ్రులు జనన ముహూర్తాల కోసం వస్తే పెట్టవద్దని పురోహితులకు సూచించారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ముహూర్తాల ప్రకారం సిజేరియన్లు చేయవద్దని గైనకాలజిస్టులకు స్పష్టంచేశారు. అయినా వినకపోతే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.