హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్ఫథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు.
భారత్లోని 11 కోట్ల బంజారా లకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని అన్నారు.తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతి ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే ఉదాహరణ అని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను ముఖ్యమంత్రి నెరవేర్చారని పేర్కొన్నారు. గ్రామ పరిపాలనలో గిరిజనులను భాగస్వాములను చేసిందని అన్నారు. గిరిజన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.