యాదాద్రి భువనగిరి : ఆలేరును అన్ని రంగాలలో అగ్రగామిలో నిలిపామని, పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంలోని పొట్టిమర్రి వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. వారంటీ, గ్యారంటీ లేని కాంగ్రెస్ చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. సాగుకు మూడు గంటలు చాలన్న ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలో కూరుకుపోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ గోసపడతామని తెలిపారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు. మూడోసారి ఆలేరు ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.