హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. వేం నరేందర్రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్నాడు రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ కుదుర్చుకున్న డీల్ నిజమా? కాదా? రూ.25 కోట్లను గండిపేట లెజెండ్ విల్లాస్లో రేవంత్రెడ్డి తమ్ముడి ఇంట్లో డబ్బులు డెలివరీ చేసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన బీఆర్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో తనను ఓడించటానికి కౌశిక్రెడ్డికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపించారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై ఈటలకు దమ్ముంటే ఇల్లందకుంట రాములోరి గుడిలో ప్రమాణానికి సిద్ధమా?
అని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ దొంగ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఇద్దరు రెండు పార్టీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారని, కోట్లాది రూపాయలు పరస్పరం చేతులు మార్చుకొని, అది బయటపడేసరికి కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతల మధ్య ముదిరిన ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టేందుకే కేంద్ర మంత్రి అమిత్షా చేవెళ్ల సభ నిర్వహించారని విమర్శించారు.
ఈటల రాజేందర్, వివేక్ ఆర్థిక వ్యవహారాలు రచ్చకెక్కిన నేపథ్యంలోనే ఆగమేఘాల మీద అమిత్షా హైదరాబాద్కు పరుగులు తీశారని తెలిపారు. ఈటల చేరికల కమిటీ చైర్మన్గా కాకుండా బ్రోకర్ల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాని విమర్శించారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ప్రభావిత శక్తిగా ఎదుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల అనంతరం దేశానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆరేనని చెప్పారు.