హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో బాల్క సుమన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
కానీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితబాంధవుడై ‘దళితబంధు’ పథకాన్ని తెచ్చారని కొనియాడారు. రాష్ట్ర ప్రగతికి కోసం, జాతి నిర్మాణం కోసం కలిసి వస్తే రండి.. లేదంటే కామ్గా ఉండండి అంటూ రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులను బాల్కసుమన్ హెచ్చరించారు. ఇద్దరు పిచ్చోళ్ల చేతుల్లో రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ బాధ్యతలను పెట్టారని విమర్శించారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపెడితే.. దాని డోమ్లను కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు.
‘అంబేద్కర్ పేరుతో ఉన్న సచివాలయాన్ని కూల్చివేసే దమ్ముందా? దమ్ముంటే రా… తేల్చుకుందాం’ అని ఆయన సవాల్ విసిరారు. ప్రగతిభవన్ను పేల్చివేస్తామని మరో పిచ్చోడు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. పేల్చివేస్తే…. కూల్చివేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో 60 లక్షల సుశిక్షితులైన సైనికులున్నారనే విషయాన్ని రెండు పార్టీలు మరచిపోవద్దని ఆయన సభాముఖంగా హెచ్చరించారు. తమ నాయకుడు కేసీఆర్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశం కోసం బయలుదేరారని తెలిపారు. ఈ నినాదం ‘పెట్టుబడిదారుల కోసం కాదని, పట్టెడం పెట్టే రైతన్న కోసమేనని ఆయన స్పష్టం చేశారు.