హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నిత్యం భూదాహంతో చెలరేగిపోతున్న రేవంత్ సర్కార్.. గత కేసీఆర్ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన రెండెకరాల స్థలంపై తాజాగా కన్నేసింది. ఇటీవలే మంత్రివర్గ భేటీలో నిర్ణయించిందే తడవుగా ఆ భూమిలో ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసానికి ఒడిగట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీశ్రావు క్షేత్రస్థాయికి వెళ్లి సర్కార్ కుట్రపై నిరసన గళం విప్పారు. ఇదే సమయంలో అల్లుడికి పదెకరాల భూ కేటాయింపు అంశాన్ని ఆయన బయటపెట్టారు. దీంతో అసలుకే ఎసరొస్తుందనుకొన్న ప్రభుత్వం.. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకొన్నది. జలమండలికి ఆ రెండెకరాల భూకేటాయింపునూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శనివారం రోజంతా జరిగిన ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా 5 గండిపేట మండలం కోకాపేటలోని సర్వేనంబరు 240లో గత కేసీఆర్ ప్రభుత్వం రెండెకరాల భూమిని శారదా పీఠానికి కేటాయించింది. ఆ తర్వాత సర్వేనంబరు 239, 240లో సుమారు 400 ఎకరాలకు పైగా భూముల్లో కేసీఆర్ ప్రభుత్వం 2021లో నియోపొలిస్ పేరిట భారీ లేఅవుట్ను చేసింది. దీంతో అందులో ఎకరా రూ.100 కోట్లకు పైగా ధర పలుకడం అప్పట్లో రియల్ మార్కెట్లో సంచలనం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ లేఅవుట్ను మరో రెండు దశల్లో విస్తరించింది. ఈ లేఅవుట్లోనే కేసీఆర్ ప్రభుత్వం కులసంఘాలకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి.
క్యాబినెట్లో రద్దు నిర్ణయం
శారదా పీఠం నిర్వాహకులు తమకు కేటాయించిన రెండెకరాల భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని గత ఏడాదికాలంగా అక్కడ పీఠం ఏర్పాటు, రాజశ్యామల ఆలయ నిర్మాణాన్ని కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా ఈ రెండెకరాల కేటాయింపులపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్నుపడింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో శారదా పీఠానికి ఇచ్చిన ఆ రెండెకరాల భూ కేటాయింపును రద్దుచేసింది. దీంతో అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరందుకున్నది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంతోపాటు అసలు ఎలాంటి కారణాలు లేకుండా రేవంత్రెడ్డి సర్కార్.. నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కేటాయింపును రద్దు చేయడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఉదయం కోకాపేటలోని శారదాపీఠం భూమి వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు, పరిసర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు.
క్షణాల్లో సర్దుబాటు ప్రకటనలు
మాజీ మంత్రి హరీశ్రావు కోకాపేటకు వెళ్లి మీడియాతో మాట్లాడేదే ఆలస్యం.. ప్రభుత్వం నుంచి ప్రకటనల పర్వం మొదలైంది. నియో పొలిస్ లేఅవుట్లో శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాల స్థలాన్ని ఆనుకొని జలమండలికి 8.75 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దానిని ఆనుకొని ఓవర్హెడ్ ట్యాంకుకు మరో 1.18 ఎకరాలు, హెచ్ఎండీఏ సైట్ ఆఫీసుకు 0.77 ఎకరాలను కేటాయించినప్పటికీ అదనంగా భూమి కావాలని జలమండలి అభ్యర్థించినట్టుగా ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాల భూమి సముద్రమట్టానికి ఏకంగా 592 అడుగుల ఎత్తులో ఉన్నదని, అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే నగరంలోని అనేక ప్రాంతాలకు గ్రావిటీపై తాగునీటి సరఫరా జరుగుతుందని, అందుకే ఆ భూ కేటాయింపును రద్దు చేసినట్టు తెలిపి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఇతర చోట రిజర్వాయర్ నిర్మిస్తే పంపింగ్ కోసం కరెంటు చార్జీల భారం అవుతుందని, ఆ రెండెకరాల్లో కేటాయిస్తే మాత్రం ఆ భారం తగ్గుతుందనే రీతిలో ప్రకటనను అన్ని ప్రభుత్వ శాఖల వాట్సాప్ గ్రూపుల్లో వేసి హల్చల్ చేశారు.
సర్కార్ కుట్రపై హరీశ్ నిరసన గళం
మాజీ మంత్రి హరీశ్రావు శనివారం శారదా పీ ఠం నిర్మిస్తున్న రాజశ్యామల ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. రాత్రికి రాత్రి వాటిని రేవంత్ ప్రభుత్వం కూల్చివేసేందుకు కుట్ర పన్నిందని నిరసన గళం విప్పారు. దానికి సమీపంలోనే ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ ఏర్పాటుతోపాటు పదెకరాల భూ కేటాయింపుల గుట్టును సైతం హరీశ్రావు బయటపెట్టారు. దీంతో జలమండలి రిజర్వాయర్ కోసమే శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రోజంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సాంకేతికంగా అంతకంటే అనువైన, ఎత్తయిన స్థలాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. దీంతో భూ కేటాయింపుల సంగతి దేవుడెరుగు.. అల్లుడి క్రషర్ బాగోతం బయటకొచ్చి విషయం బూమరాంగ్ అవుతుండటంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే సాయంత్రానికి తూచ్.. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకొని, జలమండలికి ఆ రెండెకరాల కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
విషయాలేవీ తెలియకుండా క్యాబినెట్లో రద్దా?
శారదా పీఠం నిర్మాణాల విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకురాలేదని సీఎం రేవంత్రెడ్డి అధికారులపై మండిపడినట్టుగా ప్రకటనలో పేర్కొన్నా రు. కానీ సీఎంకు తెలియకుండా భూ కేటాయింపు రద్దు జరుగుతుందా? మంత్రివర్గంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు కదా.. కానీ సీఎం తనకేమీ తెలియదన్నట్టుగా నెపాన్ని అధికారులపై నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చుట్టూ రెండెకరాల కంటే అనువైన స్థలాలు
చంద్రబాబు బాటలోనే ఈ రద్దు నిర్ణయమా?
ఆంధ్రప్రదేశ్లోనూ శారదా పీఠానికి 2021లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖ పరిధిలోని భీమిలి పట్టణాన్ని ఆనుకొని కొత్తవలస గ్రామ పరిధిలో ఈ భూమి కేటాయించారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం నెలల వ్యవధిలోనే ఆ భూ కేటాయింపును రద్దు చేసింది. ఈ సమయంలో టీడీపీ అనుకూల పత్రికల అన్నింటిలోనూ జగన్ రాజగురువు స్వరూపానందేంద్ర స్వామికి అడ్డగోలుగా కేటాయించిన భూములను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసినట్టుగా కథనాలు ఇచ్చారు. అంటే అక్కడ వైసీపీని బూచిగా చూపి పీఠానికి చేసిన భూ కేటాయింపులను రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి అనుకూలం, టీడీపీకి వ్యతిరేకమైనందునే కోకాపేటలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆ రెండెకరాల భూ కేటాయింపులను రేవంత్రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నియోపొలిస్ లేఅవుట్ వ్యూ పాయింట్ అత్యధిక ఎత్తయిన ప్రదేశమే సముద్ర మట్టానికి 583 అడుగులుగా గూగుల్లో స్పష్టంగా ఉన్నది. కానీ శనివారం ప్రభుత్వ ప్రకటనలో శారదా పీఠం రెండెకరాల భూమి సముద్రమట్టానికి ఏకంగా 592 అడుగుల ఎత్తులో ఉన్నదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
