కీసర, జనవరి 23: బాలవికాస సంస్థతో తనకు 15 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, ఈ సంస్థ నిర్వహించే ప్రతి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ సీఎస్ఆర్బీ సెంటర్లో సోమవారం జన నిర్మాణం-సమాజ నిర్మాణం పేరిట జాతీయ మహాసభను నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి, ఏపీ మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ జన నిర్మాణంతో సమాజ నిర్మాణం అవుతుందని, ప్రజలు ఒక సంఘంగా కలిసి చేస్తే అది పూర్తి విజయవంతం అవుతుందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా, ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతూ రకరకాల అనార్యోగ సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో కెనడాలోని బాలవికాస సంస్థ 1500 గ్రామాల్లో నీటిప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయని ప్రశంసించారు. ఇంతటి మహత్కార్యాన్ని చేపట్టిన బాలమ్మ దంపతులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు.
మిషన్ కాకతీయతో చక్కటి ఫలితాలు
బాలవికాస స్పూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మిషన్ భగీరథను తీసుకొచ్చారని, అదే విధంగా బాలవికాస చెరువు మట్టితీత కార్యక్రమాలు చేపడితే, తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించి చక్కటి ఫలితాలు సాధించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ బాల వికాస సంస్థ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిందని, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసం నింపిందని పొగిడారు. రింగ్ రోడ్డు నుంచి బాల వికాస సంస్థకు రోడ్డు సౌకర్యం కావాలని కోరడంతో, గతంలో రూ.60 లక్షలు ఇచ్చానని, మళ్లీ ఈ రోడ్డు కోసం రూ.1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను ఏర్పాటు చేశామని, ఆల్ ఇండియా స్థాయిలో 20 గ్రామాలు ఎంపికైతే మన తెలంగాణలో మొత్తం 19 ఎంపిక కావ డం చాలా గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బాల వికాస సంస్థ 8 వేల గ్రామాల్లో ఎన్నో రకాల అభివృద్ధి పథకాల ద్వారా 90 లక్షల మందికి లబ్ధిని చేకూర్చడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల వికాస వ్యవస్థాపకురాలు బాల థెరిసా జింగ్రాస్, ఆండ్రూ జింగ్రాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, తెలంగాణ విద్యా సంక్షేమ చైర్మన్ శ్రీధర్రెడ్డి, బాల వికాస సంస్థ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు బాసారి మర్రిరెడ్డి, జన వికాస అధ్యక్షుడు లూర్థు మర్రెడ్డి, సోపార్ అధ్యక్షుడు ఎరిక్ సోపార్, డైరెక్టర్ శోభారెడ్డి, డైరెక్టర్లు రాహుల్, సునీతారెడ్డి, తిరుపతి, మంజుల, లత, శివరాం, శోభ, పుష్ప, మోసెస్, రాంపల్లిదాయర సర్పంచ్ అండాలు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.