కంటికి కన్పించని శత్రువు కరోనా.. ఒక్కరి వంట్లోచేరి పది మందికి పాకుతున్నది.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను తీస్తున్నది.. వైరస్ సోకిన రెండు మూడ్రోజుల తర్వాత కానీ లక్షణాలు బయటపడకపోవడంతో ఈలోగానే చేయాల్సిన నష్టమంతా చేస్తున్నది. ఈ మహమ్మారిని మొగ్గలోనే తుంచేందుకు తెలంగాణ సర్కారు యుద్ధం ప్రకటించింది. జ్వర సర్వేతో కరోనాను ఇంట్లోనే కట్టడిచేసే చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వేగంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్వేవ్ కట్టడికి రాష్ట్రప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ మహమ్మారిని అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటికే వైరస్ సోకినవారికి మెరుగైన చికిత్సను అందిస్తూనే.. మరోవైపు కరోనా చైన్ను తెగ్గొట్టే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ట్రేసింగ్..ట్రీటింగ్ విధానాన్ని అమలుచేస్తున్నది. మే 15 నాటికి కరోనా తీవ్రతను చాలావరకు తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నది. కరోనా నుంచి కోలుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహమ్మారి కట్టడిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. హోం ఐసొలేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే గురువారం సాయంత్రం కరోనాపై సమీక్ష నిర్వహించి పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు శుక్రవారం తమ జిల్లాల్లో కరోనాపై కలెక్టర్లతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇతర ప్రజాప్రతినిధులు తమతమ నియోజకవర్గాల్లో కొవిడ్ నియంత్రణ కోసం రంగంలోకి దిగారు.
కరోనాపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వైరస్ ముదిరేదాక గుర్తించలేకపోతున్నారు. ప్రాథమిక లక్షణాలున్నప్పుడే గుర్తించి ముందుగానే చికిత్స అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు ఇంటింటికీ తిరుగుతూ ప్రాథమికంగా జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికల్ కిట్లను అందజేస్తున్నాయి. ఇంటివద్దే ఐసొలేషన్లో ఉండమని చెప్తున్నాయి. దీనివల్ల ప్రాథమిక దశలోనే కరోనా కట్టడి కావడంతోపాటు, ఇతరులకు వ్యాపించడాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
కరోనా సోకినవారిలో కొందరు మూడు నాలుగురోజుల్లోనే ఆక్సిజన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షలు చేయించి రిపోర్టులు వచ్చేలోగానే పరిస్థితి సీరియస్ అవుతున్నది. దీనికితోడు మెడికల్ హబ్గా పేరొందిన హైదరాబాద్కు ఇతర రాష్ర్టాల నుంచి వైద్యంకోసం పెద్దఎత్తున పేషెంట్లు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరం అవుతున్నది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 5 వేల ఆక్సిజన్ బెడ్లను అదనంగా ఏర్పాటుచేస్తున్నారు. వ్యాక్సిన్ ఇస్తేనే కరోనాను కట్టడి చేయవచ్చని సీఎం భావించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థల ప్రతినిధులతో సీఎస్ సమావేశమై వ్యాక్సిన్ సరఫరాలో రాష్ర్టానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. మొదటిడోస్ తీసుకున్న వారందరికీ రెండోడోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ మేరకు వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.
కొవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షల కంటే ముందుగానే వైద్యం అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఔట్పేషెంట్ సేవలు మొదలుపెట్టింది. హైదరాబాద్లో బస్తీ దవాఖానలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వవైద్యశాలల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం అందించి వైరస్ను అరికట్టేందుకు అవకాశం ఏర్పడింది.