హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని, సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోని స్పష్టం చేశారు. ఆసియాలోనే నంబర్ వన్గా ఉన్న సంస్థ నష్టాల బారిన ఎందుకు పడిందో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని బస్ భవన్లో ఆయన ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ.. రోజూ రూ.13 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం కరోనాతో రూ.3 కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందని, ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కష్టపడే తత్వమున్న సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారని చెప్పారు. సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామన్నారు.
కరోనా తర్వాత 95 శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఆర్టీసీకి ప్రజల ఆదరణ చాలా అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పునఃప్రారంభిస్తామన్నారు. వంద శాతం సురక్షిత ప్రయాణంతో బస్సులను నడుపుతమని స్పష్టం చేశారు.