Harish Rao | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్టు’ ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నియామక పత్రాల పేరుతో హడావుడి చేస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీ నుంచి విద్యార్థుల దృష్టిని మరల్చేందుకే ముందురోజు స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నదని దుయ్యబట్టారు. చేయని పనులకు డబ్బా కొట్టుకొనే బదులు, ఎన్నికల హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసిందని, వీటికి మరో 1,890 పోస్టులను కలుపుతూ 2023 జూన్ 22న ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని గుర్తుచేశారు. ఆయా ఉద్యోగాల భర్తీకి 2023 ఆగస్టు 2న పరీక్ష నిర్వహించామని, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ నర్సు నియామకాలను తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. దానిప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3,4 నోటిఫికేషన్, మార్చి1న పోలీసు తదితర యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
నర్సింగ్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు
స్టాఫ్నర్సులుగా ఎంపికై బుధవారం నియామకపత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు హరీశ్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మన్ననలు పొందేలా అత్యుత్తమ సేవలందించి, ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. మొత్తం 7,094 స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును అభినందించారు. నర్సు పోస్టుల పేరును ప్రత్యేకంగా జీవో విడుదల చేసి నర్సింగ్ ఆఫీసర్లుగా ఉన్నతీకరించినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్నర్సులుగా పరిగణించడం శోచణీయమని పేర్కొన్నారు.