హైదరాబాద్ : రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాలు, పల్లెల్లో ప్రభుత్వ ఉచిత విద్య అందుతున్నది. 98.20శాతం ఆవాసాల్లో (హ్యాబిటేషన్లు) ప్రాథమిక, 94శాతం ఆవాసాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలోని ఆవాసాల్లో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. ఈ లెక్కన తీసుకుంటే తెలంగాణలో కేవలం 2.8శాతం ఆవాసాల్లో ప్రాథమిక, 6శాతం ఆవాసాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలు లేవు.
ఈ వివరాలను 2020 తెలంగాణ సమగ్ర శిక్ష వార్షిక నివేదికలో విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సర్కారు స్కూళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో భాగంగా 2001 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 3090 ప్రభుత్వ పాఠశాలలను తెరిచారు. ఈ ఆరేండ్లల్లో 136 ఆవాసాల్లో కొత్త స్కూళ్లు ప్రారంభించడం గమనార్హం. దీంతో స్కూళ్లు లేని ప్రాంతాలన్నింటిలో సర్కారు స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. స్కూళ్లు లేని ప్రాంతాల్లోని విద్యార్థులు తమకు సమీపంలోని బడుల్లో చేరే అవకాశముండగా, వీరు రాకపోకలు సాగించేందుకు గాను రవాణాభత్యాన్ని అందజేస్తున్నారు.