జగిత్యాల : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. పట్టణంలోని మన బస్తీ- మన బడి కార్యక్రమంలో పాఠశాలలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి 11 శాతం నిధులు ఖర్చుచేస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుందని తెలిపారు. కేంద్రం తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు కేంద్రం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్కు దేశ వ్యాప్తంగా 750 జిల్లాలు పోటీ పడితే జగిత్యాల జిల్లాకు ద్వితీయ స్థానం దక్కిందన్నారు. జగిత్యాల పట్టణంలో రూ. 20 కోట్లతో నర్సింగ్ కాలేజీ, పోలాస వ్యవసాయ కళాశాలకు రూ. 20 కోట్లు, మెడికల్ కళాశాల మంజూరయ్యిందన్నారు. తెలుగు కు ప్రాచీన భాషా తీసుకు రావడంలో ముఖ్యమంత్రి , ఎమ్మెల్సీ కవిత కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలిశ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గట్టు సతీశ్, కౌన్సిలర్లు పంబల రామ్ కుమార్,వొద్ది శ్రీలత రామ్మోహన్ రావు, బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.