హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో భరోసా నింపుతున్నారు.
బాధితులకు బాసటగా..
బాధితులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. అధికారులతో సమీక్షిస్తూ, గ్రామాల్లో పర్యటిస్తూ భరోసానిస్తున్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి మంత్రి అల్లోల సమీక్ష నిర్వహించారు. నష్టంపై పక్కాగా నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూ చించారు. ఖమ్మం నగరంలోని మున్నేరు వర ద ప్రభావిత ప్రాంతంలో ‘పువ్వాడ ఫౌండేషన్’ సమకూర్చిన నిత్యావసర సరుకులను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ వెయ్యి మంది బాధితులకు అందజేశారు. గురువారం నుంచి ములుగులోనే బస చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఉదయం ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏటూరునాగారం మం డలం దొడ్ల, కొండాయి, మల్యాల గ్రామాల్లో 500 మందికి మంత్రి నిత్యావసరాలను అందజేశారు.
భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 414 కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో మండలి చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి ద యాకర్, ఎమ్మెల్యేలు, మేయర్ తదితరులతో కలిసి వరద నష్టంపై సమీక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ బాల్క సుమన్ అధికారులతో సమీక్షించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టును రీడిజైన్ చేసి అధునాతన సాంకేతికతతో పునర్నిర్మిస్తామని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టుకు గండిపడగా, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్బాబుతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి వారం పది రోజుల్లో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు.
కోలుకుంటున్న మోరంచపల్లి
వరద నీటితో తల్లడిల్లిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి కోలుకుంటున్నది. వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు గ్రామానికి చేరుకుని ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ్రామానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.